02/09/2025
సర్వజీవదయావేదన
కొన్నిసార్లు ఆలోచిస్తే మనుషులు మారుతున్న తీరు నిజంగా మనసుకు బాధ కలిగిస్తోంది. ఈ భూమి మీద మానవులకే కాదు—ప్రతి జీవరాశికీ సమానమైన జీవనహక్కు ఉంది. ఆ హక్కును హరించే అధికారం సృష్టికర్తకే తప్ప, ఇతరులకు లేదు.
అయితే నేటి పరిస్థితుల్లో మన దేశంలో జరుగుతున్న అరాచకాలు శృతిమించాయి. వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ఉన్న షెల్టర్ హోమ్స్ ఏ స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అక్కడ నిర్వహణలోనూ, రక్షణలోనూ ఉన్న లోపాలు చూసి మనసు కలచిపోతుంది. ఇలాంటి పరిస్థితులు మనుషులకే ఉన్నప్పుడు, మూగజీవాలైన కుక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి.
మన పిల్లలకు చదువులే కాకుండా అన్యజీవాల పట్ల దయ, రక్షణ అనే పాఠం నేర్పాలి. కానీ వాస్తవం ఏమిటంటే, ఆ పాఠం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్కు తరలించాలని నిర్ణయించారు. కానీ ఆ షెల్టర్ హోమ్స్ పరిస్థితి ఎలా ఉంది? వాటికి సరిపడ ఆహారం, సదుపాయాలు అందుతున్నాయా? అన్నది మాత్రం స్పష్టతలేని అంశం.
మన హైందవాచారంలో ప్రతి జీవిని దైవస్వరూపంగా ఆరాధిస్తాం—
కుక్కను కాలభైరవ స్వరూపంగా,
ఏనుగును విఘ్నేశ్వరుడుగా,
ప్రకృతిని పార్వతీ రూపంగా,
శక్తిని శివుని రూపంగా,
ఎలుకను, గుర్రాన్ని, ఇంతే కాదు విషపూరితమైన పామును కూడా పూజిస్తాం.
అలాంటి సంస్కృతి మనకున్నప్పటికీ, నేటి సమాజంలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఆశ్చర్యం, బాధ, దిగ్బ్రాంతి కలుగుతాయి.
కాబట్టి పిల్లలకు భూతదయ, వన్యప్రాణి-జనప్రాణి సహజీవన బోధ అనే పాఠాలు తప్పనిసరిగా నేర్పించాలి. అవి ఈనాటి అర్థంలేని చదువులకంటే ఎంతో ముఖ్యమైనవని నేను నమ్ముతున్నాను.
కుక్క అనే జీవి మనిషి మిత్రుడే. ఒక పూట భోజనం పెడితే అది రోజంతా కాపలా కాస్తుంది. అలాంటి ప్రాణిని షెల్టర్ హోమ్లో వేసి హింసించడం సమాజానికి సిగ్గు చేటు. అంతేకాక, సుప్రీంకోర్టు వీధి కుక్కలకు భోజనం పెట్టడం తప్పు అని చెప్పడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
అందుకే నా విన్నపం:
దేశ నాయకులు, న్యాయవ్యవస్థలు—అందరిని, అన్ని ప్రాణులను ఏకతాభావంతో చూసేలా వ్యవస్థను రక్షించండి. సమాజంలో మానవత్వాన్ని నిలబెట్టండి.
ఇట్లు,
మీ క్రాంతి వర్ధన్