08/08/2026
మోకిల ప్లాట్ల ఈ-వేలానికి విశేష స్పందన..
అప్సెట్ ధర కంటే మూడురెట్లు అధికం
హైదరాబాద్ నగర భూముల వేలంలో ఎప్పటికప్పుడు ఊహకందని రీతిలో ధరలు పలుకుతున్నాయి. ఇటీవల కోకాపేట భూముల వేలం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..!
హైదరాబాద్ నగర భూముల వేలంలో ఎప్పటికప్పుడు ఊహకందని రీతిలో ధరలు పలుకుతున్నాయి. ఇటీవల కోకాపేట భూముల వేలం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఐటీ ప్రాంతం.. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోని మోకిల లేఅవుట్లోని ప్లాట్ల ఈ-వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేలంలో ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. చదరపు గజం గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ధర పలికింది. కనీస ధర రూ.72 వేలకు విక్రయించడం విశేషం. మొత్తం ప్లాట్లకు సరాసరి చదరపు గజం ధర రూ.80,397 పలికింది. నార్సింగి-శంకర్పల్లి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలోని మోకిలలో 165 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్ ఉంది. తొలి విడతలో 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను విక్రయించేందుకు నెల రోజుల క్రితం హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ప్లాట్ 300- 500 చదరపు గజాల్లోపు ఉంది. కోకాపేట నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగిలకు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అప్సెట్ ధర చదరపు గజానికి రూ.25 వేలు నిర్ణయించగా.. కొన్ని మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తం 50 ప్లాట్లకు రూ.40 కోట్లు ఆశించగా.. అంతకు మూడు రెట్లు అధికంగా రూ.121.40 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రెండో విడతలో మరో 50-100 ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. ఒకటి రెండురోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
#ఈనాడు #హైదరాబాద్