27/12/2015
అరగంటలో యాదాద్రి!
హైస్పీడ్ మెట్రోరైల్కు ప్రభుత్వ నిర్ణయం
-ఉప్పల్ -యాదాద్రి మార్గం సర్వేలోహెచ్ఎంఆర్
-రింగ్రోడ్డునుంచి గుట్ట కింది వరకు మార్గం
-ఉప్పల్ వద్ద భారీ రవాణా హబ్, స్కైవే
నగర రవాణా వ్యవస్థలో మరో ముందడుగు. ఉప్పల్నుంచి కేవలం అరగంటలో యాదాద్రిని చేరుకునేలా హైస్పీడ్ మెట్రోరైల్ వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మార్గాన్ని సర్వే చేయాలని హెచ్ఎంఆర్ని ఆదేశించింది. మెట్రోరైలు వ్యవస్థను పూర్తిస్థాయిలో నగర అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేవలం నగరానికే ఈ వ్యవస్థను పరిమితం చేయకుండా శివారు నగరాలన్నీ అనుసంధానం చేయాలని విశ్వనగరం బ్రాండ్ను సార్థకం చేస్తే వేగవంతమైన సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సంకల్పించింది. ఉప్పల్-యాదాద్రి హైస్పీడ్ మెట్రోరైల్ నిర్మాణంపై సర్వే ప్రతిపాదనను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ధ్రువీకరించారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు తమను ఆదేశించారని శనివారం మెట్రోభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
metro
భవిష్యత్తులో ఉప్పల్ నుంచి యాదాద్రికి వాహనాల రద్దీ భారీగా పెరిగే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నారని, భక్తులు ఇతర ప్రయాణికులు సునాయాసంగా, వేగంగా యాదాద్రి చేరుకునేలా హైస్పీడ్ మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ప్రాథమిక సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ మార్గంలో హైస్పీడ్ మెట్రో నిర్మాణానికి అనుకూల వాతావరణం ఉందని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉప్పల్ నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సు ద్వారా గంటన్నర.. రైలుమార్గం ద్వారా సుమారుగా గంటా 45 నిమిషాల వరకు పడుతున్నది. హైస్పీడ్ రైల్ అందుబాటులో వస్తే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే యాదాద్రికి చేరుకోవచ్చు. నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో గరిష్ట స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు కాగా హైస్పీడ్ మెట్రో గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆయన చెప్పారు.
52 కిలోమీటర్లమార్గంలో..
ఉప్పల్ రింగ్రోడ్ నుంచి యాదాద్రి వరకు సుమారు 52 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిపాదిత హైస్పీడ్ మెట్రో మార్గం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ప్రారంభమై యాదాద్రి గుట్ట క్రింది వరకు ఉంటుంది. ఈ మార్గంలో ఇటు భూ ఉపరితల మార్గం, అటు ఎలివేటెడ్ మార్గం రెండింటిని పరిశీలిస్తున్నారు. భవిష్యత్ అవసరాలు నిర్మాణ వ్యయం దృష్ట్యా భూతల హైస్పీడ్మెట్రో మేలని మెట్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉప్పల్ - వరంగల్ 163వ జాతీయ రహదారికి అనుకుని దక్షిణ మధ్యరైల్వే ట్రాక్కు సమాంతరంగా సర్వే నిర్వహిస్తున్నామని హెచ్ఎంఆర్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కిలోమీటర్ భూతలమార్గానికి రూ. 100 - 140 కోట్లు, ఎలివేటెడ్ మెట్రో రూ. 200 కోట్ల వరకు ఖర్చవుతుంది. 52 కిలోమీటర్ల భూతల మార్గం ఇతర నిర్మాణాలన్నీ కలుపుకుని ఉజ్జాయింపుగా రూ. 6000 కోట్లు అవసరమని భావిస్తున్నారు.
ఉప్పల్ వద్ద భారీ రవాణా హబ్..
నగర రవాణా వ్యవస్థలో ఉప్పల్ అత్యంత కీలక ప్రాంతంగా మారనుంది. ఇక్కడ మెట్రో, ప్రతిపాదిత హైస్పీడ్మెట్రో, ఆటో, ట్యాక్సీ, సిటీబస్సులు, అంతర్జిల్లా బస్సులను అనుసంధానం చేస్తూ భారీ రవాణాహబ్ను హెచ్ఎంఆర్ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడి అర ఎకరం స్థలంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నాగోలు - రాయదుర్గం మెట్రో కారిడార్, హైస్పీడ్ మెట్రో కారిడార్, ఇతర రవాణా వ్యవస్థలను కలుపుతూ ఈ హబ్ను నిర్మిస్తున్నామన్నారు. నాగోలు - రాయదుర్గం కారిడార్, హైస్పీడ్ కారిడార్, రవాణాహబ్లు దేనికవి వేర్వేరుగానే ఉంటాయి. ఈ మూడింటిని భారీ స్కైవాక్తో అనుసంధానం చేస్తారు. మెట్రో, సిటీబస్సులు, ఆటో, ట్యాక్సీల ద్వారా ప్రయాణికులు నేరుగా ఉప్పల్కు చేరుకుని.. ఇక్కడి హైస్పీడ్మెట్రో స్టేషన్ ద్వారా యాదాద్రి వరకు చేరుకోవచ్చు. స్కైవాక్ ఏర్పాటు వల్ల మెట్రో, హైస్పీడ్మెట్రోలో ప్రయాణించే వారు రోడ్డుమీదికి రానవసరం లేకుండా స్కైవాక్ సహాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు.
ప్రపంచంలో హైస్పీడ్ రైళ్లు ఇవే. .
-షాంగై -మాగ్లెవ్ మార్గంలో నడిచే సీఆర్హెచ్ 380 ఏ హైస్పీడ్ రైలు గంటకు 430 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని సాధారణ వేగం 251 కిలోమీటర్లు.
-బీజింగ్ - షాంగై మార్గంలో నడిచే హర్మనీ సీఆర్హెచ్ 380 ఏ రైలు గంటకు 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
-నాపోలి -రోమా- బాలోగ్నా - మిలానో కారిడార్లో పరుగులుపెట్టే ఏజీవీ ఇటా హైస్పీడ్ రైల్ వేగం గంటకు 360 కిలోమీటర్లు.
-బార్నిలోనా -మాడ్రిడ్ మధ్య నడిచే సిమెన్స్ వెలారో ఈ/ఏవీఎస్ 103 హైస్పీడ్ రైల్ గంటకు 350 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.