22/08/2015
మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకత
మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం ... మంగళవారం ... శుక్రవారం ... పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు.
శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని అంటారు. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటూ వుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు.
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి.
ఇక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ 'వరలక్ష్మీ వ్రతం' జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఊరు ... ప్రతి వీధి ... ప్రతి ఇల్లు వ్రతాలతో ... పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వ్రతం జరుగుతోన్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అంటారు. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. ఈ 'శ్రావణ పౌర్ణమి' రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. జ్ఞాన స్వరూపంగా 'హయగ్రీవ స్వామి' ... పరిపూర్ణ అవతారంగా 'శ్రీ కృష్ణుడు' జన్మించింది ఈ మాసంలోనే. దైవ సంబంధమైన ఇన్ని వేడుకలకు వేదికగా నిలిచిన కారణంగానే శ్రావణమాసాన్ని అంతా ఆహ్వానిస్తారు ... ఆరాధిస్తారు.
శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి. అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను! ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు. పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది
లక్ష్మి దేవి యొక్క స్థానాలని తెలుసుకొని పూజించుకునేప్రయత్నం చేదాం .ఎందుకంటే లక్ష్మి దేవి ని ఈ శ్రావణమాసం లో ఎక్కువగా పూజిస్తారు. గురువుని పూజించిన అలాగే మాత్రు పితృ భక్తి కలిగిన వారికీ లక్ష్మి కటాక్షం ఎప్పుడు ఉంటుందని ప్రగడ విశ్వాసం నమ్మకం కూడాను.అతిగా నిద్రపోయే వాళ్ళ ఇంట్లో అలాగే ప్రాతః: కాల సమయము నందు పూజ చేయని వారి ఇంట్లో లక్ష్మి నిలవదు.గడపకి పసుపు రాయక పోయిన అలాగే స్త్రీలు నిషిధమయిన నాలుగు రోజులు పూజ మందిరమునకు దూరం గ ఉండక పోయిన లక్ష్మి నిలవదు.కాబట్టి మంగళకర మయిన వాటిని నిత్యం దానం చేయడం మన యింటిని పరిసుబ్రం గ ఉంచుకుంటూ జీవించడం ముఖ్యమయిన సూచనగా భావించండి..
https://www.facebook.com/pages/Srivaaram-DevotionalHealth-Magazine/234016006614389?fref=ts