11/11/2025
ఏపీలో కొత్తగా మరో 6 వరుసల జాతీయ రహదారి.. ఆ రూట్లోనే.. డీపీఆర్లో మార్పులు?
ఏపీలో మరో జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. ఈ ప్రతిపాదిత డీపీఆర్ మీద గత బుధవారం స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ కష్టమయ్యే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే డీపీఆర్లో అండర్పాస్లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోమరో జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి.మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత డీపీఆర్ మీద ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణపై ఇటీవల జిరిగిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో .. జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేసిన అంశాలపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే.. మచిలీపట్నం విజయవాడ ప్రతిపాదిత డీపీఆర్లో బెంజ్ సర్కిల్, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య అండర్పాస్లు లేదా ఫ్లైఓవర్ల ప్రస్తావన లేకపోవడం పట్ల మంత్రి జనార్ధన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి చేర్చాలని NHAI అధికారులకు సూచించారు.