13/10/2021
నిక్డిక్ నిధులతో నక్కపల్లి క్లస్టర్ అభివృద్ధి.
– 3,196 ఎకరాల్లో పారిశ్రామికవాడ నిర్మాణం
– విశాఖ – చెన్నై కారిడార్లో భాగంగా అభివృద్ధి
– తొలిదశలో 1,178 ఎకరాల్లో రూ.1,800 కోట్లతో మాస్టర్ప్లాన్ను నిక్డిక్కు పంపిన ఏపీఐఐసీ
– ఇప్పటికే ఏడీబీ నిధులతో 1,120 ఎకరాల అభివృద్ధికి టెండర్లు
NICDC-National Industrial Corridor Development Corporation
రాష్ట్రంలో మరో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విశాఖ – చెన్నై కారిడార్లో భాగంగా నక్కపల్లి వద్ద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిక్డిక్) సహకారంతో 3,196 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు.
ఇప్పటికే ఏడీబీ నిధులతో నక్కపల్లి వద్ద 1,120 ఎకరాలను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీ తాజాగా మరో 3,196 ఎకరాలు అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏల్ఈఏ, ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ఆమోదం కోసం నిక్డిక్కు పంపినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు.
మొత్తం 3,196 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా కింద తొలిదశలో 1,178 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.1,800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలకు నిక్డిక్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, త్వరలోనే తుది అనుమతులు వస్తాయని ఆ అధికారి వెల్లడించారు.
నిక్డిక్ నిధులతో ఇప్పటికే కృష్ణపట్నం వద్ద క్రిస్సిటీ నిర్మాణానికి టెండర్లు పిలవగా, కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను ఏపీఐఐసీ రూపొందింస్తోంది. ఏడీబీ నిధులతో అభివృద్ధి చేస్తున్న 1,120 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు.
ఆటోమొబైల్, పెట్రోకెమికల్స్ పెట్టుబడులకు లక్ష్యం..
నక్కపల్లి నోడ్లో ఆటోమొబైల్, డిఫెన్స్, పెట్రో కెమికల్స్, ఇంజనీరింగ్ క్యాపిటల్, పీవీసెల్స్ తయారీ రంగాల పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. విశాఖ, గంగవరం పోర్టులు దగ్గరలో ఉండటంతో పాటు కొత్తగా సమీపంలో కాకినాడ సెజ్లో మరో పోర్టు అందుబాటులోకి రానుండటంతో పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులకు నక్కపల్లి సెజ్ అనుకూలంగా ఉంటుందని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది.
ప్రొపైన్ డీ హైడోజనేషన్ వంటి రసాయనాలను నేరుగా దిగుమతి చేసుకునేందుకు ప్రత్యేకంగా జెట్టీ నిర్మించే ఆలోచనలో ఏపీఐఐసీ ఉంది.